గరుడ పురాణం

garuda_puranam_telugu_pdf_sample_page

గరుడ పురాణము
వాసుకి పరుగెడుతున్నపుడు అతని రక్షణలోనున్న బలాసురుని పిత్తం నుండి కొన్ని బిందువులు జారిపడుతుండగా గరుత్మంతుడు వాటిని అందుకొని పానం చేశాడు. వెంటనే ఆయనకి మైకం కమ్మేసినట్లుగా కావడంతో ఆయన దానిని వమనం, కక్కివేయుట చేశాడు. ఆయన రెండు నాసికారంధ్రాల ద్వారా వెలువడి నేలపైబడిన ఆ పిత్తభాగము అద్భుత కాంతితో మెరిసే మరకతాలకు గనిగా మారింది. ఆ మహామణులు కోమలమైన చిలుక వన్నెలోనూ, శిరీష పుష్ప వర్ణంలోనూ, మిణుగుడు పురుగు వెనుకభాగం రంగులోనూ, హరిత తృణక్షేత్రంవలెనూ, నాచురంగులోనూ, సర్పభక్షిణి నెమలి కన్నుల వన్నెలలోనూ నవహరిత పత్రవర్ణంలోనూ మెరుస్తుంటాయి. ఇవి లోకకళ్యాణ కారకాలు. గరుత్మంతుని స్పర్శ వలనయోమో గాని ఇక్కడి మరకతమణులు సర్వవిషవ్యాధులనూ నశింపజేసే శక్తిని కలిగి వుంటాయి. అయితే ఇవి దుర్లభాలు; దొరకడం చాలా కష్టం. ఎన్నో మంత్రాలకూ, మరెన్నో ఔషధాలకూ లొంగని విషాలు కూడా గరుత్మంతుని మూలంగా వచ్చిన రత్నాలు తగలగానే పటాపంచలై పోతాయి.
గరుత్మంతునిచే, వాసుకిచే వదలబడిన బలాసురాత్మీయ భాగాలలో లభించునవే ఈ నాటికీ ప్రపంచంలో అత్యుత్తమ మణులుగా నెలకొనివున్నాయి. ఇవి చాలా చోట్ల నుండే వస్తున్నాయి గాని. ఏవైనా వాసుకి వదలిన, గరుత్మాన్ కదిలిన స్థానంలో పుట్టిన మణుల తరువాతనే.
రత్న విద్యా విశారదులైన విద్వజ్జనులు ఇలా వచిస్తారు. చిక్కటి ఆకుపచ్చని రంగులో కోమలకాంతులతో మెరుస్తూ, ముట్టుకొన్నా నొక్కినా గట్టిగా తగులుతూ, మధ్యభాగంలో బంగరుపొడి వున్నట్టుగా భ్రమింపజేస్తూ, సూర్యకిరణాలు గానీ వేరే ఉత్తమ కాంతులు గానీ సోకినపుడు మొత్తం మణి పచ్చగా మెరిసినా దాని మద్య భాగం నుండి సూర్యసమాన కాంతులు ఉజ్వలంగా వెలువడి తొలుతటి పచ్చదనాన్ని అధిగమించి వెలుగుతూ వుండే మరకతమణి గొప్ప ప్రభావం కలది. దానిని చూడగానే మన మనసులో ఏదో తెలియని ఆనందం ప్రవేశించి, వేళ్ళూనుకొని మనను పరవశింపజేస్తుంది. ఇంత అధికంగా మనకు ఆహ్లాదం కలిగించే శక్తి ఏ ఇతరమణికీ వుండదు. ఈ లక్షణాలున్న మరకత మణినే సకల సద్గుణవతిగా భావించాలి.

మరింత చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

 

 

 

 

Copyright © 2024 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |